ద్విపదభాగవతం - మధురకాండ : కంసుఁడు ముష్టికచాణూరులు మడియుటఁ జూచి తన సేనాపతులతోఁ బలుకుట
భోజభూపతి వారు పొలియుటఁ జూచి
రాజసంబెడలి బోరన నశ్రులొలుక
వడివాద్యముల మ్రోఁత వారించి తనదు
పడివాళ్ళఁ బిలిచి నిర్భయవృత్తిఁ బలికె.
ఈ పాపకర్ముల నిరువుర నీళ్ళ
ద్రాపించి, వసుదేవుఁ దునుమాడి, నంద
గోపునియిలు ముట్టుకొని చెఱఁబెట్టి
గోపాలకులఁ బట్టికొని, యుగ్రనేను
దండించు డని భోజధరణీశుఁ డాడు
దండిమాటలకల్గి దానవాంతకుఁడు.
- 230